Tuesday, 13 October 2020

Moral Story in Telugu ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు

ఒకఊరిలో అత్తాకోడల్లు మాట్లాడుకుంటుండగా మాటల్లో చిన్నకోడలు అన్ని దానాల్లోకెల్లా నీరు దానం చెయ్యడం చాలాగొప్ప,  నీళ్లిస్తే వచ్చేంత పుణ్యం- అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు పర్యాయాలే కదా తింటాము! కాని నీళ్లు-  నీళ్లు ప్రతిరోజూ అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుంటాం, ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది‌. "అని చెప్తుంది.

   
మర్నాడు అత్త పెందలకడనే లేచి
నుయ్యి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్లందరూ
హడావిడిగాఅక్కడకుచేరుకున్నారు.

   "అత్తగారూ! మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది వుండగా మీరు ఈ నూతి దగ్గరకు రావడమేమిటి? "

   "మీరేమీ ప్రశ్నించకండి! నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించు
కోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు."

   
మరునాటి నుండి కోడళ్లు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏంచెయ్యాలో తోచలేదు.  "అమ్మా! నాకు సెలవిప్పించండి."
అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో " ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు. షాపులో వేరే పని అప్పగిద్దాం!" అన్నది.
"చిన్నకోడలి మంచితనం"తెల్సుకుని అత్త చాలా సంతోషించింది.

   చిన్న కోడలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. "ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు.
పిండి విసురుతున్నారు. నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? "ఒకనిర్ణయానికి వచ్చింది.

   
తరువాతిరోజు ఉదయాన్నే వంట
గది చేరుకుని అంట్లు ముందేసుకుని
బూడిద చేతిలోకి తీసుకుని మూల కూర్చున్నది. పనిమనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది‌. గబగబా అత్తగారు వచ్చింది.

    "ఏమే! నా ముద్దుల కోడలా! ఇది మాత్రం నీకు తగదు.మనకుపనిచేసే
వాళ్లున్నారు.అంట్లు తోమడం వల్ల
 నీ బట్టలు ఖరాబవుతాయి. నీ నగలు అరిగిపోతాయి." అని
సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు " అత్తయ్యా! నన్ను
కాస్సేపు మాట్లాడనివ్వండి. ఎంగిళ్లెత్తడంలో గొప్ప
మాహాత్మ్యము వున్నది. మీరు మహాభారతం లో కథ వినలేదో! పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ని ప్రధమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా! ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరియెంగిలి
విస్తళ్లు ఎత్తేపని చేసాడు తెలుసా!  ఎంగిళ్లెత్తటమనేది ఎంత మహిమా
న్వితం కాకపోతే భగవంతుడీ పనెందుకు చేస్తాడు?"

 
తర్వాత రోజు అత్తవచ్చి వంటింట్లో
తిష్ట వేసి అంట్లు ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్లందరూ చుట్టు
ముట్టారు. వెంటనే చిన్న కోడలు
" అత్తయ్యా! ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో! ఈ పళ్లెం, చిన్న గ్లాసుపై నాకే
హక్కు వున్నది. ఎందుచేతనంటే -
ఇవి నా పతిదేవుడివి. కనుక వీటిని
నేను తోముతాను." అంది. దానికి
అత్తగారు " వెళ్లు వెళ్లు! వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు.కాబట్టి వీటిని నేనే తోముతాను." ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్లందరూ కూర్చుని వాళ్లూ అంట్లు కడగడం ప్రారంభించారు.

 
" ఇప్పుడు నేనేంచెయ్యను? అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజూ ఉదయం ఇల్లు తుడవడానికి
నౌకరు వస్తూంటాడు కదా!అనుకుని
వేకువకాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చేముందుగానే
గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్త
గారిది చూసి " చిన్న కోడలా! ఇల్లు
నువ్వు తుడిచావేమిటి? అని అడగ్గా కోడలు-

    " అత్తయ్యా! మీరు కాస్సేపు ఊరుకోండి. మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో
పనిపోతుంది అని ఇంకా ఇలా అన్నది.
  "మీరు రామాయణం వినలేదా! అడివిలో గొప్ప గొప్ప ఋషులు,
మునులు వుండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్లాడు. ఎందుకో తెలుసాండీ ?శబరి రోజూ పంపాసరో
వరానికివెళ్లే దారిలో రాళ్లూరప్పలని తొలగించి ఋషులకు దారిఏర్పాటు
చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ వున్నది. "

    
మర్నాటినుండి కోడళ్లందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి
పనుల్లో వారు మునిగిపోతున్నారు.
శుభ్రంగా గదులు తుడుస్తున్నారు. నీళ్లు తోడుతున్నారు. అంట్లు
శుభ్రపరుస్తున్నారు.వంటలు వండు కుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్లందరూ అన్యోన్యంగా ఉంటున్నారు.
అత్తామామలను గౌరవంగా చూసు
కుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్లందరికీ
నగలు చేయించారు.

   ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు వుంటున్న గదిలోనికి వెళుతూండగా అత్త  చూసింది.

   చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటున్నది.

   " అక్కా! మీకు ఆడపిల్లలు వున్నారు. వారు పెరుగుతున్నారు. రేపో,మాపో వారికి పెళ్లిళ్లు చేయాలి.
నాకైతే ఇంకా పిల్లలు లేరు.అందు
వల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మానాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నాదగ్గర ఇనప్పెట్టెలో పడి వున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో! పిల్లల పెళ్లిళ్లకి అక్కరకొస్తాయి." అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట
నుండి ఇదంతా గమనిస్తున్న  అత్త
ఒక్కసారిగా చలించి పోయింది.



కొసమెరుపు: ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు.ఈకొత్త కోడలు తాను చెప్పినది
ఆచరణ చేసి చూపించింది. ఇంటిని సంస్కరణ బాటలోకి నడిపించింది.👍

(వివేక చూడామణి.) స్వామీజీ వ్రాసిన పుస్తకం నుండి
సేకరణ

No comments:

Post a Comment